పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతిని అరికట్టేందుకు సమాచార హక్కుచట్టం పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి. ఈ మేరకు ఆయన సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కమిషనర్ల నియామకంపై లేఖ రాశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత సమాచార కమిషన్, కమిషనర్ల నియామకం జరగాల్సి ఉన్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖలు రాసినా ఫలితం లేదన్నారు. దీంతో హైకోర్టులో పిల్ వేశామని తెలిపారు.
కోర్టు ఆదేశాలతోనే 2017లో రాష్ట్రంలో కమిషన్ ఏర్పాటు చేసిందని, చీఫ్ సమాచార కమిషనర్ 2020లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఖాళీగానే ఉందన్నారు. ఈ నెల 24వ తేదీతో కమిషనర్ల పదవీకాలం పూర్తి అవుతుందని తెలిసినా.. అందుకు సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ మొదలు పెట్టలేదన్నారు.
అభ్యర్థుల ఎంపిక కోసం సర్చి కమిటీని నియమించి సెలక్ట్ లిస్ట్ తయారు చేయాల్సి ఉన్నా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా చొరవ తీసుకొని నియామకం చేపట్టాలని లేఖలో గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు పద్మనాభరెడ్డి.