హాష్ ఆయిల్ పేరుతో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 400 లీటర్ల హాష్ ఆయిల్ తో పాటు మూడు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ కు చెందిన ప్రవీణ్ కుమార్, పటాన్ చెరు వాసి మోహన్ యాదవ్, కళ్యాణ్, సురేష్ కలిసి మత్తు దందా సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏపీలోని విశాఖ పట్నం జీ మాడుగుల మండలంలోని గంజాయి సాగు చేసే వారితో వీరు పరిచయం పెంచుకున్నారు.
వారి ద్వారా గంజాయి నుంచి తీసిన హాష్ ఆయిల్ సేకరించి ఆయిల్ ను ప్రవీణ్.. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లోని మత్తు పదార్థాల దందా చేసే వారికి సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు మిగతా ముగ్గురితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు.
సీసాలో హాష్ ఆయిల్ పోసి ఈ ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 60 హాష్ ఆయిల్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.