నంద్యాల గ్రామంలో పెద్ద పులి పిల్లలు ప్రత్యక్ష్యమయ్యాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లలను కనిపించాయి. పెద్ద గుమ్మడాపురం సమీపంలో నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుని ఊరి చివర పంట పొలాల్లోకి నాలుగు పెద్ద పులి పిల్లలు వచ్చాయి. వీటిని స్థానికులు గుర్తించారు.
పులి పిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరచకుండా.. వాటిని తీసుకెళ్లి ఓ గదిలో భద్రపరిచారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. ఈ పులి పిల్లలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలి వస్తున్నారు. కొందరు సెల్ఫీలు కూడా దిగుతున్నారు.
ఈ పిల్లలు గ్రామం వైపు ఎలా వచ్చాయని స్థానికులు అవాక్కయ్యారు. అయితే ఈ పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలా? లేక జూకు తరలించాలా? అన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు అధికారులు. ఈ పిల్లలను జూకి తరలిస్తే తల్లి పులి వీటి కోసం గ్రామంలోకి చొరబడి ప్రజలపై దాడి చేసే అవకాశముందని భయాందోళనకు గురవుతున్నారు.
అలాగని అటవీ ప్రాంతంలో వదిలేస్తే కుక్కలు, ఇతర జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటిని ఎక్కడికి తరలించాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.