ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సమీపంలోని బాచుపల్లి లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసే అంశంపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఒక సంస్థ ఫౌండర్, సీఈఓగా ప్రకటించుకున్న రాధాకృష్ణ అనే వ్యక్తిపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెచ్ఎండీఏ ఫిర్యాదుపై బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లిలో హెచ్ఎండీఏ 73 ప్లాట్లతో లేఅవుట్ ను రూపొందించింది. దీనిపై ఫిబ్రవరి 17వ తేదీన బాచుపల్లి లేఅవుట్ లో హెచ్ఎండీఏ అధికారులు ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్రీ బిడ్ సమావేశానికి దాదాపు 300 మందికి పైగా హాజరు అయ్యారు. బాచుపల్లి లేఅవుట్ కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యక్తులు, సంస్థలు, హెచ్ఎండీఏ పేరుతో సాధారణ ప్రజానీకాన్ని, ప్లాట్ ల కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్ఎండీఏ సూచించింది.
బాచుపల్లి లేఅవుట్ లోని 73 ప్లాట్లపై మార్చి 2వ తేదీ, 3వ తేదీలలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టీసీ ఆన్ లైన్ ద్వారా వేలం (ఈ -ఆక్షన్) నిర్వహించనుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల, మియాపూర్ క్రాస్ రోడ్డుకు, ఐటీ హబ్ కు సమీపంలో ఉన్న బాచుపల్లి లేఅవుట్ పరిసరాల్లో పలు గేటెడ్ కమ్యూనిటీ విల్లా వెంచర్ల మధ్యలో ఉండడం వల్ల ఎంతోమంది ఇక్కడి ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ బాచుపల్లి లేఅవుట్ లోని ప్లాట్ల కొనుగోలుకు పెట్టుబడుల స్వీకరణ పేరిట ఒక ఆంగ్ల దినపత్రికలో గత శనివారం(25వ తేదీ) ఆదివారం(26వ తేదీ) ప్రకటనలు ఇచ్చి ప్రజలను, ప్లాట్ల కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాన్ని హెచ్ఎండీఏ సీరియస్ గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెచ్ఎండీఏ పేరును ప్రస్తావిస్తూ ప్రజానీకాన్ని, కొనుగోలుదారులను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి వారి మోసాలకు, ప్రభావాలకు ప్రజలు దూరంగా ఉండాలని హెచ్ఎండీఏ ప్రజానీకానికి, ప్లాట్ ల కొనుగోలుదారులకు విజ్ఞప్తి చేసింది.