తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ విధించారు. కొజికోడ్ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలో దమ్మాన్ కు బయలు దేరిన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
అనంతరం దాన్ని తిరువనంతపురానికి మళ్లించారు. ఆ విమానంలో హైడ్రాలిక్ బ్రేకుల వైఫల్యం తలెత్తినట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ అధికారులు వివరాల ప్రకారం.. 182 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్ ఇండియా విమానం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయ్యే సమయంలో రన్వేను ఢీ కొట్టింది.
ఈ క్రమంలో విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు తెలిపారు. దీంతో విమానాన్ని వెంటనే తిరువనంతపురానికి దారి మళ్లించారు. మధ్యలో ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానంలో ఫుల్ గా వున్న ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్ చేశారు.
అనంతరం విమానాన్ని మధ్యాహ్నం 12:15 గంటలకు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం విమానాశ్రయంలో అధికారులు పూర్తిగా ఎమర్జెన్సీని ప్రకటించారు.
168 మంది ప్రయాణికులతో కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్ కు బయలు దేరిన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎయిర్ లైన్స్ పేర్కొంది. ఈ కారణంగా విమానాన్ని దారి మళ్లించి తిరువనంతపురంలో ల్యాండ్ చేసినట్టు వెల్లడించింది.