టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో అతడికి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ అండగా నిలిచాడు. ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఇలాంటి పరిస్థితులు రావడం చాలా స్వరసాధారణమైన విషయమని తెలిపాడు.ఆఖరికి సచిన్, రాహుల్ ద్రవిడ్, నేను సైతం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని చెప్పాడు.
“ఓసారి అంతర్జాతీయ క్రికెట్లో అతడు సాధించిన రికార్డులు చూడండి. నైపుణ్యం, సామర్థ్యం లేకుండా ఇది సాధ్యంకాదు కదా. ప్రస్తుతం అతడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ విషయం అతడికి కూడా తెలుసు. కోహ్లీకి తన సామర్థ్యం గురించి అవగాహన ఉంది. ఇది ఒక్క కోహ్లీకే సాధ్యం. క్రీడారంగంలో ఇలాంటివి సాధారణం. ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది. సచిన్, రాహుల్, నాకు జరిగాయి. కోహ్లీకీ కుడా అదే జరిగింది. భవిష్యత్తులో వచ్చే ఆటగాళ్లకు కూడా జరుగుతుంది. ఇదంతా క్రీడల్లో భాగం. ఒక క్రీడాకారుడిగా వారు చెప్పేది జాగ్రత్తగా విని.. మన ఆట మనం ఆడుకోవాలి”. అంటూ గంగూలీ పేర్కొన్నాడు.
ఇప్పటికే విరాట్ కోహ్లీ తన పేలవ ప్రదర్శనతో అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాడు. టీ20ల్లో నుంచి విరాట్ను పక్కనపెట్టాలని సూచించాడు దిగ్గజ ఆటగాడు కపిల్దేవ్. సరిగ్గా ఆడని ఆటగాళ్లను పక్కనపెట్టాలని మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు కోహ్లీ జట్టుకు భారంగా మారాడని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ప్రదర్శన ఇలానే కొనసాగితే ఆక్టోబర్ 16 నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం కష్టంగా మారే అవకాశం ఉంది.