రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవిపల్లిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గాంజా మత్తులో మైనర్ బాలుడిపై దాడికి పాల్పడ్డారు. కిరాణా కొట్టులో కూర్చున్న ఓ బాలుడిని బలవంతంగా దానమ్మ జోపిడి గుట్టల వద్దకు తీసుకొని వెళ్లింది గాంజా గ్యాంగ్. గంజాయికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలుడు సమీర్ బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో కొట్టి తీవ్రంగా హింసించారు.
ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత గాంజా గ్యాంగ్ నుంచి ఎలాగోలా తప్పించుకుని సమీర్ ఇంటికి చేరుకున్నాడు. బాలుడి ఒంటిపై గాయాలు చూసిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తనను కిరాణాకొట్టు నుండి కొంత మంది తీసుకొని వెళ్లి డబ్బులు ఇవ్వాలని విచక్షణారహితంగా కొట్టారంటూ తల్లిదండ్రులకు చెప్పాడు బాలుడు. దీంతో సమీర్ తల్లిదండ్రులు మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మహ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ విషయం తెలుసుకున్న గంజాయి గ్యాంగ్.. ‘నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో.. ఇప్పటికే ఇద్దరిని హత్య చేశాం’ అంటూ బాలుడిని బెదిరించారు.