సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గుడాటిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గౌరవెల్లి ప్రాజెక్టులో భాగంగా ట్రయల్ రన్ కు వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డకున్నారు. దీంతో కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయ్యిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ తెలిపారు.
అందిరికి దఫల వారీగా డబ్బులు చెల్లిస్తున్నామని.. కొంతమందికి మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు మేజర్లయిన దాదాపు 500 మందికి ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
భూనిర్వాసితులు చేపడుతున్న ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. నిరసన కారులకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మద్దతు పలికారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ తరహాలో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భూనిర్వాసితులతో కలిసి మంత్రి హరీశ్ రావు ఇంటికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. గౌరవెల్లి శివారులో వారిని పోలీసులు అడ్డుకున్నారు. గౌరవెల్లి నుంచి హుస్నాబాద్ మార్గాల్లో 2 చోట్ల పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్ భూనిర్వహితులతో చర్చలు జరిపారు.