ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో డీవై పాటిల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతి వరకూ ఫైట్ చేసిన లక్నో టీమ్.. 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కోల్కతా ఆల్ రౌండర్ రింకూ సింగ్ బ్యాటింగ్ దాటికి లక్నో బౌలర్లు చేతులెత్తేయడంతో.. ఇక ఓటమి చవిచూడక తప్పదనుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్లేయర్లు ఎంత ఒత్తిడికి లోనయ్యారో.. అంతకు మించి ఒత్తిడికి గురయ్యారు లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 19 పరుగులు అవసరమవగా.. రింకూ సింగ్ వరుసగా 4, 6, 6, 2 తో రెచ్చిపోయాడు. దీంతో గెలుపు సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులతో తేలికగా మారిపోయింది. చేతుల్లో ఉన్న మ్యాచ్ చేజారుతుండటంతో డగౌట్ లో ఉన్న గంభీర్ చాలా ఎమోషనల్ అయిపోయాడు.
ఆఖరి ఓవర్ లో స్టాయినిస్ వేసిన ప్రతి బంతికీ ముందు గంభీర్ కళ్లు మూసుకుని దేవుడ్ని ప్రార్థిస్తూ కనిపించాడు. చివరికి లక్నో టీమ్ గెలుపొందడంతో డగౌట్ లో గట్టిగా అరుస్తూ.. గాల్లోకి పంచ్ లు విసురుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? కోల్కతా జట్టుకి గతంలో కెప్టెన్ గా ఉన్న గంభీర్.. ఆ జట్టుని రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు.
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. ఈ మ్యాచ్ లో మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడు. అన్ని జట్ల కంటే ముందే ప్లేఆఫ్స్ బెర్తుని ఖాయం చేసుకునేలా కనిపించిన ఎల్ఎస్జీ.. కేకేఆర్ తో మ్యాచ్ కి ముందు వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో.. టీమ్ తో పాటు మేనేజ్ మెంట్ కూడా ఒత్తిడిలో కనిపించింది. ఈ నేపథ్యంలో.. ప్లేఆఫ్స్కి చేరగానే అంతా ఊపిరి పీల్చుకుని.. గెలుపు సంబరాలు చేసుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ కి ఇదే మొదటి ఐపీఎల్ సీజన్ కావడంతో.. ఆటగాళ్ల వేలం దగ్గర నుంచి ఆ టీమ్ లో గంభీర్ మార్క్ కనిపిస్తోంది.