దేహాలు మాత్రమే వేరు..మా మనసులు ఒక్కటే. మేం పెళ్ళిచేసుకుంటాం మాకు అనుమతివ్వండి అంటూ ఓ హోమో సెక్సువల్ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 15 ఏళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని..పెళ్ళికి అనుమతించాలని ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా అనే ఇద్దరు యువకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఒకవేళ వీరి వివాహాలకు చట్టబద్ధత లభిస్తే.. తైవాన్ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్ నిలవనుంది. ఉత్కర్ష్, కోటియాలు 2008 నుంచి ప్రేమలో ఉన్నారు.
భారత్లో స్వలింగ సంపర్కానికి ఆమోదం లేక పోవడంతో ప్రజల ఆలోచనలు మారతాయేమోనని ఇప్పటివరకు వేచి చూశామని ఈ జంట తమ పిటిషన్లో చెప్పింది. సమాజంలో ప్రజల ఆలోచనలు క్రమంగా మారుతున్న తరుణంలో.. ఇటీవల కాలంలో LGBTQ వ్యక్తులు తమ లైంగికతను బహిరంగంగా ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలోనే సక్సేనా, కోటియాలు తమ బంధం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. వారిలో చాలా మంది తమ బంధాన్ని అంగీకరించారని, కానీ సామాజిక కోణంలో ఇంకా ఆమోదం లభించలేదని అన్నారు