వాళ్ళ ప్రేమను పెద్దలు అనుమతించలేదు. అయినా పెళ్ళి చేసుకున్నారు. దీంతో అమ్మాయి పుట్టింటి వాళ్ళు అక్కసు వెళ్ళగక్కారు. అబ్బాయి ఇంటిని తగుల బెట్టారు. హుజురాబాద్ మండలంలోని ఇందిరానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…హుజురాబాద్ కు చెందిన రాజశేఖర్, అదే గ్రామానికి చెందిన సంజనను ప్రేమించాడు. ఇటీవలే వేములవాడ రాజన్న గుడిలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ హుజురాబాద్ పోలీసులను ఆశ్రయించారు దంపతులు.
విషయం తెలుసుకున్న అమ్మాయి కుటంబసభ్యులు, బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. అబ్బాయి ఇంటిపై దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. కానీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి.
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫైనాన్స్ లో తెచ్చిన రూ. 50 వేల కాలిబూడిదయ్యాయని రాజశేఖర్ తండ్రి దేవయ్య వాపోయాడు. అమ్మాయి తరుప వాళ్లు తమని చంపుతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు.