మెదక్ కస్టోడియల్ డెత్ పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కదిలింది. చైన్ స్నాచింగ్ కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకొని ప్రాణాలు పోయేట్టుగా పోలీసులు చితక బాదిన ఖదీర్ ఖాన్ మృతి పై హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకున్న ఈఘటన పై హైకోర్టు లో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్ తో పాటు పలువురు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా కోర్టులో హాజరుపర్చిన 14 రోజులకు ఖదీర్ మరణించారని అదనపు ఏజీ వాదనలు వినిపించగా.. ఖదీర్ మృతికి కారణాలపై విచారణ జరుపుతామని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే మెదక్ కు చెందిన ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి చిరు వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతనికి భార్యా, ముగ్గురు పిల్లలున్నారు. సాఫీగా సాగిపోతున్న ఇతని జీవితంలోకి ఖాకీలు యమదూతల్లా ఎంటర్ అయ్యారు. గత నెల 27న అరబ్ గల్లీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. ఓ మహిళ పుస్తెలతాడు కొట్టేశారని మెదక్ పీఎస్ లో ఫిర్యాదు నమోదైంది. దీంతో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. అనుమానం కింద విచారించడానికి ఖదీర్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని చేత నిజం కక్కించడానికి నాలుగు రోజులు ఉంచి థర్డ్ డిగ్రీని ప్రయోగించారు.
ఎలాంటి కేసు నమోదు చేయకుండానే అతన్ని కుళ్లపొడిచారు. చివరికి అతను కాదని తేలిన తరువాత అతడి భార్యను స్టేషన్ కు పిలిచి.. ఇంటికి తీసుకొని వెళ్లాలని చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని.. బలానికి గోలీలు కూడా తామే తెచ్చి ఇస్తామని అవి వేసుకుంటే అంతా సర్దుకుంటుందని చెప్పారు. అయితే, ఖాకీల కర్కశత్వానికి తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఖదీర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణిస్తూవచ్చింది. ఈనెల 8న అతడ్ని మెదక్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ లో చేర్చారు. అక్కడ కూడా ప్రయోజనం లేకపోవడంతో గాంధీ ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఖదీర్ గురువారం అర్థరాత్రి తర్వాత ప్రాణాలు వదిలాడు.
అయితే.. మెదక్ డీఎస్పీ మాత్రం.. తాము విచారించి వదిలిపెట్టినప్పుడు ఖదీర్ ఆరోగ్యంగానే ఉన్నాడని.. తరువాత అస్వస్థతకు గురయ్యాడని చెబుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఖదీర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చిన పలువురు నేతలకు.. పోలీసులు ఎలా కొట్టారో వివరిస్తూ ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.