విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు.
ఇక ఈ రోజు రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూపు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల సదస్సుకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ఈ రోజు షెడ్యూల్ విషయానికొస్తే.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వివిధ వ్యాపార అంశాలపై చర్చ జరగనుంది. వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై ఈ దిగ్గజ వ్యాపారవేత్తలు చర్చించనున్నారు.
మరో వైపు సాయంత్రం 6 గంటలకు బీచ్ రోడ్డులోని ఎంజీఎం మైదానంలో అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా విందు ఏర్పాటు చేసింది. ఇక రేపు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పెట్టుబడులపై ఒప్పందాలు జరుగుతాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సదస్సు ముగియనుంది. అయితే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విశాఖ వేదిక కావడం చాలా ఆనందంగా ఉందని సీఎం జగన్ అన్నారు.