రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ని రద్దు చేసింది హైకోర్టు. ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ నెల 23వ తేదీ వరకు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలను అడ్డుకోవటానికే ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 1ని తీసుకొచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన డివిజన్ బెంచ్ కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది.
జగన్ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్ వివరణ ఇచ్చారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 1861 పోలీస్ యాక్ట్కు లోబడే జీవో నెంబర్ 1 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇస్తామన్నారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదన్నారు.
కాగా రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ జీవో తెచ్చారని ఆరోపిస్తున్నారు. తమ సభలకు వస్తోన్నజనం, ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్బంధాలకు తెరతీశారని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామం ఆసక్తికరంగా మారింది.