మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ పెట్టి తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసిన కేసీఆర్.. ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసీఆర్ చెప్పడం.. తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. జీవనది లాంటి శ్రీరామ సాగర్ ను మహారాష్ట్ర చేతికి ఇస్తే.. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం స్మశానం అవుతుందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు మారిపోతాయని, ఎస్ఆర్ ఎస్ పీ వరద కాలువ ప్రాజెక్టు వృధా అవుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమం వచ్చిందే సాగునీటి కోసమని.. ఇప్పుడు తెలంగాణ హక్కుగా ఉన్న ప్రాజెక్టును మహారాష్ట్రకు అప్పగిస్తానంటే.. కేసీఆర్ ను ప్రజలు ఛీ కొడతారంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గోదావరిపై మహారాష్ట్ర కడుతున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టుల గురించి మనం ఎన్నో ఉద్యమాలు చేశామని..ఇప్పుడు ఆ నీళ్లను వాళ్లు తోడుకుంటే చూస్తే ఊరికే ఉందామా.. అని నిలదీశారు.
బాబ్లీ మీద పోరాటం చేసిన వాళ్లు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని.. ఈ విషయంపై వాళ్లేమంటారని నిలదీశారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకపోతే రైతు ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు.దీంతో పాటు కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం పై పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేటీఆర్ పర్యటనకు రెండ్రోజుల ముందే కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏమాత్రం పద్ధతి కాదని ఫైర్ అయ్యారు.