హైదరాబాద్ నగరంలో చూడదగ్గ ప్రదేశాల్లో గోల్కొండ కోట ఒకటి. పర్యాటకులు కాలంతో పని లేకుండా దీనిని సందర్శిస్తుంటారు. అయితే జనవరి 28, 29 తేదీల్లో పర్యాటకులకు గోల్కొండ కోట చూసేందుకు అనుమతి లేదు అంటుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ పర్యటనకు వస్తున్న జీ20 ప్రతినిధులు.. గోల్కొండ కోటను సందర్శించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జీ20 సమావేశాల నేపథ్యంలో సమ్మిట్ వర్కింగ్ గ్రూప్ హైదరాబాద్లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా చారిత్రక కట్టడమైన గోల్కొండ కోటను కూడా సందర్శించనుంది ఈ టీమ్. అలాగే రాణి మహల్ను కూడా సందర్శించే అవకాశం ఉంది. కాగా, జీ20 లీడర్స్ సమ్మిట్ ఈ ఏడాది సెప్టెంబర్ 9, 10 వ తేదీల్లో జరగనుంది. ఈ సదస్సుకు ముందు దేశంలోని 56 నగరాల్లో 215 కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా హైదరాబాద్లో 6 సమావేశాలు జరుగనున్నాయి. తొలి సమావేశం జనవరి 28న జరుగనుండగా.. మార్చి 6,7, ఏప్రిల్ 26, 27, 28, జూన్ 7, 8, 9, జూలై 15, 16, 17 తేదీల్లో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ పర్యటనలో భాగంగా G20 ప్రతినిధులు నగరంలో అనేక ప్రదేశాలను సందర్శించనున్నారు.
జీ-20 సన్నాహక సమావేశాలకు ముందస్తు ప్రిపరేషన్లో భాగంగా ఇమ్మిగ్రేషన్, టూరిజం సిబ్బందికి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ వర్క్షాపులో ఏఎస్ఐ అధికారులు, మాన్యుమెంట్ గైడ్లు, ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ గైడ్, రాణి మహళ్, గోల్కొండ ఫోర్ట్లోని సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సెషన్లో పరిశుభ్రత, వ్యక్తిగత వస్త్రధారణ, మర్యాదలు, పర్యాటక అవగాహన, గైడెన్స్ ఇవ్వడంపై అవగాహన కల్పించారు.