ప్రపంచంలో అనేక దేశాల్లోని చాలా ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్న విషయం విదితమే. అలాగే కాంగోలోనూ ఉన్నాయి. అయితే అక్కడి ఓ ప్రాంతంలో తాజాగా బంగారు కొండ ఒకటి బయట పడింది. అందులో పెద్ద ఎత్తున బంగారం ఉందని తెలుసుకున్న స్థానికులు బంగారాన్ని తవ్వుకోవడం కోసం ఎగబడ్డారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగక తప్పలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
మధ్య ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో దక్షిణ కివు ప్రావిన్స్ లోని లుహిహి అనే గ్రామంలో బంగారంతో నిండిన కొండ ఒకటి బయట పడింది. అందులో 60 నుంచి 90 శాతం వరకు బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ విషయం తెలుసుకున్న స్థానికులు పలుగు, పార పట్టుకుని కొండ వద్దకు వెళ్లి బంగారాన్ని తవ్వుకోవడం మొదలు పెట్టారు. కొందరైతే ఏకంగా అక్కడే చేతుల్తోనే మట్టిని తోడుతూ మట్టిని నీటిలో వేస్తూ బంగారాన్ని వేరు చేయడం మొదలు పెట్టారు.
A video from the Republic of the Congo documents the biggest surprise for some villagers in this country, as an entire mountain filled with gold was discovered!
They dig the soil inside the gold deposits and take them to their homes in order to wash the dirt& extract the gold. pic.twitter.com/i4UMq94cEh— Ahmad Algohbary (@AhmadAlgohbary) March 2, 2021
అయితే ఈ సంఘటనకు చెందిన ఓ వీడియోను అక్కడి ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ ఆల్గోబరీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే విషయం తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం ఆ కొండ వద్ద తవ్వకాలు చేపట్టడాన్ని నిషేధించింది. అక్కడికి ఎవరూ వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే మైనింగ్ సంస్థలకు అధికారికంగా ఆ కొండను కాంట్రాక్ట్కు ఇవ్వనున్నారు.
అయితే కాంగోలో బంగారు గనుల్లో తవ్వకాలు జరగడం కొత్తేమీ కాదు. అక్కడ ఇలాగే జరుగుతుంది. కానీ ఆ దేశం నుంచి అక్రమంగా ఇతర దేశాలకు రవాణా అయ్యే బంగారమే ఎక్కువ శాతం ఉంటుంది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు.