సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. పెండింగ్లో ఉన్న వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014 సంవత్సరం జూన్ 1 నుంచి.. 2022 మే19 వరకు పెండింగ్లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సింగరేణి.
ఇటీవల ఆర్ఎల్సీ సమక్షంలో జరిగిన చర్చల్లో సింగరేణి సంస్థ వన్ టైమ్ సెటిల్మెంట్ కింద వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అంగీకారం తెలిపింది. మెడికల్ బోర్డు నిర్వహించడంలో ఏర్పడిన జాప్యం కారణంగా వయోపరిమితి 35 సంవత్సరాలు దాటడంతో ఉద్యోగం దొరకని వారికి అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అందిన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సింగరేణి స్పష్టం చేసింది.
2022 ఏప్రిల్ 22న ఎవరైనా సింగరేణి ఉద్యోగి అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి అనర్హులైతే.. సదరు ఉద్యోగి జీవిత భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. వారి వారసులకు సింగరేణిలో ఉద్యోగం ఇవ్వడానికి సంస్థ అంగీకరించింది. 8 ఇతర అంశాలపై సహాయ కార్మిక కమిషనర్ లక్ష్మణ్ సమక్షంలో సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య హైదరాబాద్ లో చర్చలు జరిపిన అనంతరం తాజాగా ఒప్పందం కుదిరింది.
ఒప్పంద పత్రంపై గుర్తింపు పొందిన యూనియన్ టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీ, జాతీయ సంఘాలైన ఐఎస్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్ నాయకులు, సింగరేణి యాజమాన్యం తరపున సంచాలకుడు ఎన్. బలరామ్, జీఎం ఆనందరావు సంతకాలు చేశారు.