ప్రముఖ సెర్చింజిన్ సంస్థ గూగుల్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతోంది. మొత్తం 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఉద్వాసనకు గురవుతున్న ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్స్ పంపినట్లు పేర్కొంది.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ వెబ్సైట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక సంక్షోభం భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. గత కొన్నేండ్లుగా భారీగా నియామకాలు చేపట్టామన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
గూగుల్, ఆల్ఫాబెట్లోని పలు విభాగాల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఖర్చులను తగ్గించుకోవడం, పనితీరును మెరుగుపరుచుకోవడం, మూలధనం వృద్ధి వంటి విషయాలపై ప్రస్తుతం దృష్టిసారిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కఠిన నిర్ణయానికి తనదే పూర్తి బాధ్యత అన్నారు. ఈ కోతలు ఉద్యోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఉద్యోగులను తాను క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే మైక్రోసాప్ట్ కూడా తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది.