గురువారం రాజ్ భవన్ లో వైద్య దర్బార్ నిర్వహించారు గవర్నర్ తమిళి సై. అందులో భాగంగా ఆమె వైద్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు.
క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రాంను ప్రారంభించిన అనంతరం ఆమె రాజ్ భవన్ లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ ఫార్మా హబ్ గా మారిందని ప్రధాని మోడీ ప్రస్తావించడాన్ని గవర్నర్ గుర్తు చేశారు.
వైద్యారోగ్య శాఖకు బడ్జెట్ లో రికార్డు స్థాయిలో రూ.12,161 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గతేడాదితో పోల్చితే రూ.721 కోట్లు ఎక్కువ కేటాయింపులు జరిగినందున ఇది ఆరోగ్య తెలంగాణ సాధనకు మరింత దోహదం చేస్తుందన్నారు.
వైద్య రంగంలో మరిన్ని విప్లమాత్మక మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పిన గవర్నర్.. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా జిల్లాకో నర్సింగ్ కాలేజీలు ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా పేదలకు మెరుగైన చికిత్స అందుతోందని అన్నారు.