వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ వీడలేదు. ఏడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది కానీ తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నప్పటికీ.. మెజార్టీ ఓట్లు సాధించలేకపోయారు. దీంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్నారు.
వరంగల్-ఖమ్మం- నల్గొండలో పట్టభద్రుల స్థానంలో మొత్తం 3,87,969 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో 21,636 ఓట్లు చెల్లుబాట కాకుండాపోయాయి. మిగిలిన 3,66,333 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,10,840 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక తెలంగాణ జనసమితి అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్కు 70,072, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 39,107ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్కు 27,588 ఓట్లు పోల్ అయ్యాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి.. తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మొత్తంగా తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో ప్రస్తుతం సెకండ్ ప్రయారిటీ ఓట్లు కీలకంగా మారాయి.