గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 11 నిర్వహించ తలపెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ పై ఈ రోజు ఉదయం విచారణ జరిగింది.
ఇక తన కుమార్తె కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినందున తాను విచారించలేనని జస్టిస్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. పిటిషన్ ను మధ్యాహ్నం మరో బెంచ్ కు ఆయన పంపించారు. మధ్యాహ్నం జస్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిషన్ విచారణ చేపట్టి..ప్రిలిమ్స్ పరీక్ష పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
అయితే వివిధ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు సంబంధిత ఎగ్జామ్స్ మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలన్న రూల్ ను అమలు చేయకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధమని 36 మంది అభ్యర్థులు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనిపై వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి,సిట్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
అయితే మార్చి నెలలో కమిషన్ లోని ఉద్యోగుల వల్ల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యహారం వెలుగులోకి రావడంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ .. ఆ పరీక్షను జూన్ 11 న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు పిటిషనర్లు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కార్యదర్శి, సిట్ ను ప్రతివాదులుగా చేర్చారు.