గులాబ్ గండం ముంచుకొస్తోంది. ఆదివారం సాయంత్రం ఉత్తర ఆంధ్రా-దక్షిణ ఒడిశా తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 95 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడొచ్చని హెచ్చరించింది. తీరం దాటిన తర్వాత ఆదివారం ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో, సోమవారం దక్షిణ ఛత్తీస్గఢ్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.
సెప్టెంబర్లో అత్యంత అరుదుగా తుపాన్లు వస్తుంటాయని చెప్పిన వాతావరణశాఖ.. గులాబ్ ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉండొచ్చని తెలిపింది. తుపాను దాటికి భారీ విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గుడిసెలు, ఇతర నిర్మాణాలు, విద్యుత్/కమ్యూనికేషన్ లైన్లు పంటలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది.
గులాబ్ ప్రభావంతో.. ముంబై, గుజరాత్ సహా విదర్భ, తెలంగాణ, మరాఠ్వాడా, కొంకణ్ తీరంలో సెప్టెంబర్ 29 వరకు భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసిన వాతావరణశాఖ.. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. గులాబ్ తర్వాత మరో తేలికపాటి తుఫాను అనుసరించే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 28 సాయంత్రం నుంచి ప్రభావం చూపుతుందని, దాని కారణంగా కోల్కతా, ఒడిశా, ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు పడవచ్చని తెలిపింది.