తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ను గద్దె దించాలని ప్రయత్నిస్తున్న వాళ్లలో ఆర్ఎస్ ప్రవీణ్ ఒకరు. ఒకప్పుడు కేసీఆర్ కనుసన్నల్లోనే పని చేసిన ఈయన.. వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీ అద్యక్షుడు అయ్యారు. యాత్రలు, ధర్నాలు అంటూ కేసీఆర్ సర్కార్ ను ఎండగడుతున్నారు. అలాగే, ట్వీట్లతోనూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్గాల నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్పీ యువత మధ్య మత చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఎంతమందిని ఊచకోత కోసింది అందరికీ తెలుసని అన్నారు బాలరాజు. ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, భయబ్రాంతులకు గురిచేసినా బీజేపీపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేసిన ప్రవీణ్.. ఇప్పుడు బీజేపీ ఆశయం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
స్వేరోస్ దేశాన్ని ఉద్దరిస్తుందనే భావనను విద్యార్థుల్లోకి తీసుకెళ్లారని విమర్శించారు ఎమ్మెల్యే. దోచిపెట్టిన డబ్బులతో స్వేరోస్ సంస్థలను ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.