టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక విషయాలను బయట పెట్టారు డీసీపీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్ ప్రకారమే పాస్ వర్డ్ హ్యాక్ చేసి ఎగ్జామ్ పేపర్స్ ను డౌన్ లోడ్ చేశారన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ అనే వ్యక్తి కలిసి ఈ పని చేశారని తేల్చారు.
పాస్ వర్డ్ హ్యాక్ చేసి ఎగ్జామ్ పేపర్స్ ను డౌన్ లోడ్ చేశారన్నారు. వీరితో పాటు ఇటీవలే టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి ఎంపికైన రేణుక అనే గురుకుల్ టీచర్ కూడా ఉన్నారని వెల్లడించారు. డౌన్ లోడ్ చేసిన పేపర్స్ ను రేణుక ఇంటికి తీసుకెళ్లిందని, ఆ తర్వాత అభ్యర్థులైన గోపాల్ నాయక్, శ్రీను నాయక్ లకు వాట్సాప్ లో వాటిని పంపించిందని పోలీసులు తెలిపారు.
రేణుక భర్త కూడా డీఆర్డీఏలో టెక్నికల్ విభాగంలోనే పని చేస్తాడని కూడా చెప్పారు. మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్స్ పరీక్ష ఉండగా.. పరీక్షకు రెండు రోజుల ముందే పేపర్స్ ను లీక్ చేశారని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో ఇంకా ఎలాంటి పేపర్లు లీక్ అయ్యాయో ఇప్పుడేం చెప్పలేమని, ఫోరెన్సిక్ రిపోర్టు తర్వాతే అది తెలుస్తుందన్నారు. అసలు వీరంతా కలిసి ఈ పని ఎందుకు చేశారన్న విషయం ఇంకా తెలియదని చెప్పారు. గతంలో వీరు ఇంకా ఏమైనా అవకవతలు చేశారా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.