ఒమిక్రాన్ భయంతో అతిగా ఆందోళన పడుతున్నారా? ఆ పేరుతో ఏదైనా మెయిల్ వచ్చినా.. మెసేజ్ వచ్చినా కంగారు కంగారుగా క్లిక్ చేసేస్తున్నారా..? ఓటీపీలు అడిగితే ఇచ్చేస్తున్నారా..? అయితే.. బీ కేర్ ఫుల్. మీరు పడుతున్న ఆ ఆందోళనే.. మీ పాకెట్లు ఖాళీ చేయొచ్చు. అకౌంట్లలో పైసా లేకుండా మీకు తెలియకుండానే ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.. మిమ్మల్ని నిలువునా దోచుకునే సైబర్ నేరగాళ్లు మోపయ్యారు.
ఫోర్టీగార్డ్ అనే.. సైబర్ సెక్యూరిటీ రీసర్చ్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. సైబర్ క్రిమినల్స్ కు.. ఒమిక్రాన్ ఓ వెపన్ గా మారిందన్న ఆందోళనకరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగైదు అంతకన్నా కాదు. ఇప్పటికే.. 12 దేశాలు కొత్త మాల్ వేర్ బారిన పడ్డాయట. ఈ మెయిల్స్ ద్వారా రెడ్ లైన్ మాల్వేర్ ను పంపిస్తున్నారు. వాటితో నెటిజన్ల యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు అన్నీ తెలుసుకుంటున్నారు. ‘Omicron Stats.exe’ పేరుతో వచ్చే ఈ లింక్ ను.. పొరబాటున కూడా క్లిక్ చేయొద్దని ఫోర్డీగార్డ్ రీసెర్చర్లు చెప్తున్నారు.
ఈ మాల్ వేర్ తో సేకరించిన ఒక్కో యూజర్ సమాచారాన్ని.. కనీసం 10 డాలర్లకు అమ్మి సైబర్ క్రిమినల్స్ సొమ్ము చేసుకుంటున్నారని ఫోర్టీగార్డ్ తెలిపింది. జనాల వీక్ నెస్ ను క్యాష్ చేసుకోవడంలో సైబర్ క్రిమినల్స్ ఎప్పుడూ అవకాశాల కోసం వెతుకుతుంటారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయంతో ప్రపంచ వ్యాప్తంగా జనాలు పడుతున్న టెన్షన్ ను హ్యాకర్లు ఇలా రెడ్ లైన్ మాల్వేర్ తో క్యాష్ చేసుకుంటున్నారని ఆ సంస్థ తెలిపింది.
ఈ మాల్వేర్ 2020లోనే వెలుగు చూసినప్పటికీ.. ఇప్పుడు ఒమిక్రాన్ పేరుతో హ్యాకర్లు విచ్చలవిడిగా నెటిజన్లను టార్గెట్ చేస్తున్నట్టు ఫోర్టీగార్డ్ చెప్పింది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ మెయిల్స్ లో వచ్చే లింక్స్ ను ఆలోచించి క్లిక్ చేయాలని సూచిస్తోంది.