తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం.. రామనామ జపంతో భక్త జన సంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూల నుంచి దీక్షా పరులు తరలి వచ్చి అంజన్న చెంతన దీక్షా విరమణ చేస్తున్నారు.
అర్ధరాత్రి నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో ఆలయమంతా భక్తులతో కిటకిటగలాడుతోంది. ఆలయ పూజారులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరుముడితో పాదయాత్రగా వస్తున్న దీక్షాపరులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. పెద్దఎత్తున హనుమాన్ మాలధారులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
రామయ్య సన్నిధి వద్దనున్న ఆంజనేయస్వామి ఆలయంలోనూ ఇరుముడులు సమర్పిస్తున్నారు. హనుమాన్ మాలదారులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జయంతి వేడుకల సందర్భంగా అభయాంజనేయ స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు.