జాకోరా ఎత్తిపోతలతో ప్రజల కష్టాలు తీరతాయని.. ఇక్కడికొచ్చిన ప్రజల కళ్లలో ఆనందం కనపడుతోందని తెలంగాణ మంత్రి హరీశ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండంలో జాకోరా ఎత్తిపోతల పథకానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. పోచారం శ్రీనివాస రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉండటం.. ఇక్కడి ప్రజల అదృష్టమని హరీశ్ అన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆయనకు ముందుగానే తెలుస్తాయని స్పష్టం చేశారు.
జాకోరా లిఫ్ట్ చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో నిజాం నవాబులు కట్టిన ప్రాజెక్టులు తప్ప.. గడిచిన ఏడు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులు ఒక్కటి లేవన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని.. ఆదాయం సంగతేమో కానీ.. రైతుల పెట్టుబడులను మాత్రం కేంద్రం రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపు మంటగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో ధాన్యం ఈ స్థాయిలో పండుతోందన్నారు. ధాన్యం చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోతున్నారన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేసే పరిస్థితులు ఉండేవిని వివరించారు హరీశ్.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, సింగూరు వంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నామని.. దీంతో వర్షాల కోసం ఆకాశం వైపు చూసే పరిస్థితి రైతులకు లేకుండాపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ కొరత, ఎరువుల కొరత ఉండేదని ఆరోపించారు. రైతుల పొలాలకు జలాలొస్తుంటే.. విపక్షాలకు కన్నీళ్లొస్తున్నాయని విమర్శలు చేశారు. కేంద్రం అన్నదాతలకు మేలు చేస్తే ఓర్వలేకపోతోందని ఆరోపించారు మంత్రి హరీశ్.