హరీష్ రావు, తెలంగాణ మంత్రి
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా ఏడేండ్ల కాలంలోనే తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ది. నారాయణ్ ఖేడ్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా అనేవారు. సమైక్య రాష్ట్రంలో జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు.
కేసీఆర్ ప్రభుత్వ చొరవతో ఇప్పుడు ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తోంది. త్వరలో సాగునీరు కూడా రాబోతోంది. రూ.4వేల కోట్ల రూపాయలతో 4 లక్షల ఎకరాలను సాగునీరు అందించే గొప్ప కార్యక్రమానికి సీఎం శంకుస్థాపన చేశారు.
వరద నీరు గోదావరిలో కలవడమే మనకు తెలుసు. అలాంటిది గోదావరి నీళ్లను వెనక్కి మళ్లించి.. మంజీరాలో కలిపే అద్భుత కార్యక్రమాన్ని చేపట్టారు కేసీఆర్. 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి జలాలను మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ కు.. అక్కడ నుంచి సింగూర్ కు, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ కు అందించబోతున్నారు.