తెలంగాణలో ఎప్పటి నుంచో వరి అన్నం తింటున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తానే అన్నం తినడం నేర్పానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాకముందు అక్కడి ప్రజలు జొన్న, మక్కలు గట్క తప్ప ఏమీ తినలేదనడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వారి ధాన్యం వల్ల నాలుగు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతోందని, ఆ రాష్ట్రాలకు తెలంగాణే అన్నం పెడుతుందని అన్నారు.
సిద్ధిపేట రూరల్ మండలం చిన్న గుండవెళ్లిలో హరీష్ రావు ఆదివారం పర్యటించారు. చిన్న గుండవెళ్లిలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. ఈ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలలో వరిసాగు చేస్తే, ఆంధ్రప్రదేశ్లో కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు అయ్యిందని అన్నారు.
రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ఆలోచనలతో అనేక సంక్షేమ పథకాలతో గొప్ప మార్పు వచ్చి అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షాలకు ఏమని విమర్శించాలో అర్థం కాక సతమతమవుతున్నారని అన్నారు.
ఆయిల్ ఫామ్ సాగు కోసం బడ్జెట్లో రూ.వెయ్యికోట్ల సబ్సిడీ కింద అందిస్తున్నామని చెప్పారు. రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగుచేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. రైతులకు మేలు చేకూర్చాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని హరీష్ రావు అన్నారు.