హరీశ్ శంకర్ దర్శకుడుగా అప్పుడెప్పుడో రవితేజ, జ్యోతిక జంటగా వచ్చిన “షాక్” సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అది అంతగా ఆడలేదు. అయితే ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రవితేజతోనే “మిరపకాయ” సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాతే తనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ “దబాంగ్”కి తెలుగు రీమేక్ అది.
కేవలం కథలోని మెయిన్ లైన్ మాత్రమే తీసుకుని, పక్కాగా తెలుగు కథలా రాసుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ మేనరిజం అండ్ హీరోయిజం దృష్టిలో పెట్టుకుని తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఫుల్లుగా చొప్పించి మరీ మార్చేశాడు దబాంగ్ని “గబ్బర్ సింగ్”లా. ఆ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ కెరీర్లోనే మరచిపోలేని సినిమా అయిపోయిందది.
గబ్బర్ సింగ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన రామయ్యా వస్తావయ్యా పెద్ద డిజాస్టర్. సాయి ధరం తేజ్తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ యావరేజ్ సక్సెస్. చివరగా అల్లు అర్జున్తో దువ్వాడ జగన్నాథం మళ్ళీ యావరేజ్గా ఆడినా, హరీశ్ శంకర్కు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. మళ్ళీ ఇప్పుడు వరుణ్ తేజ్ ముఖ్యపాత్రలో “వాల్మీకి” సినిమా చేస్తున్నాడు. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండకు తెలుగు రీమేక్. రియల్ లైఫ్ విలన్తో హీరోగా ఒక యంగ్ డైరెక్టర్ సినిమా చేయడం ఈ సినిమా కథ. తమిళంలో సిద్దార్థ్ హీరో అండ్ బాబీ సిమ్హా విలన్. ఇప్పుడు ఆ సినిమా రీమేక్ కథను మళ్ళీ హరీశ్ శంకర్ గబ్బర్సింగ్ టైప్లో మూలకథ అలాగే ఉంచి, భారీ మార్పులు చేస్తూ “వాల్మీకి”గా చేస్తున్నాడు.
తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలీని తమిళ హీరో అధర్వ మురళి హీరోగా, టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ను విలన్ అనలేకపోయినా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్గా చూపిస్తున్నాడు. అధర్వకు జోడీగా మృణాళినీ నటిస్తుంటే, వరుణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తమిళంలో విలన్ పాత్రకు జోడీయే ఉండదు. అక్కడ హీరో పాత్ర హైలైట్ అవుతుంది, కానీ తెలుగులో మాత్రం విలన్ పాత్ర హైలైట్ అయ్యేలా చేస్తున్నాడు. మరి పవన్ కల్యాణ్కు గబ్బర్సింగ్తో భారీ సక్సెస్ అందించిన హరీశ్ ఇప్పుడు వరుణ్ తేజ్కు కూడా “వాల్మీకి”తో అదేలాటి విజయాన్ని అందిస్తాడా? ఇప్పటికే ఫస్ట్ లుక్ అండ్ టీజర్లలో వరుణ్ తేజ్ లుక్స్ అండ్ డైలాగ్స్తో భారీగా అంచనాలను పెంచేశాడు. వాల్మీకి చిత్రం మరో గబ్బర్ సింగ్ అవుతుందని అభిమానులు ఆశించడంలో తప్పులేదు మరి.