ఇటీవల కన్నుమూసిన నిజాం ముకర్రం జా కుమారుడు అజ్మత్ జాను తొమ్మిదో నిజాంగా ప్రకటించడం సరికాదని అస్ ఫజాహీ వంశస్థులు, మజ్లిస్ ఎ సాహెబ్ జాదాగన్ సొసైటీ సభ్యులు, నిజాం కుటుంబీకులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలపై కనీస అవగాహన లేని అజ్మత్ కు వారసత్వ బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజాం ట్రస్టీల్లో ఒక్కరినీ సంప్రదించకుండా, ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. శనివారం ఓ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లండన్ లో పుట్టి పెరిగిన అజ్మత్ కు నిజాం కుటుంబీకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.
‘16 ట్రస్టుల్లోని 4,500 మంది సభ్యులంతా కలిసి నవాబ్ రౌసఖ్ యార్ ఖాన్ ను తొమ్మిదో నిజాంగా ఎంపిక చేశాం. రౌనఖ్ ప్రమాణ స్వీకార తేదీని త్వరలో ప్రకటిస్తాం. మా నిర్ణయానికి తెలంగాణ మద్దతు కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కలిసి వారికి పరిస్థితులను వివరించాం.. ‘అని తెలిపారు.