దేశంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే 60 శాతం ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం 3260 కేసులు నమోదు కాగా.. గురువారం ఈ సంఖ్య 5218కి ఎగబాకింది. ముంబయిలోనే 2479 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో గురువారం కరోనాతో ఒకరు చనిపోయినట్లు వైద్య శాఖ నివేదికలో వెల్లడైంది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులు, నిపుణులతో భేటీ అయ్యారు. పలు రాష్ట్రాల్లో వైరస్ కేసులు అధికంగా నమోదు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్న జిల్లాలపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని స్పష్టం చేశారు. వైరస్పై పర్యవేక్షణ పెంచాలని, మ్యుటేషన్లను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించాలని సూచించారు. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్యపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని స్పష్టం చేశారు. అర్హులైన వారికి ప్రికాషన్ డోసులను అందించాలని సూచించారు. టీకాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని, వాటిని వృథా చేయకుండా పంపిణీ వేగాన్ని పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జూన్ 10 నుంచి 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతూ వస్తోంది. 51 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి నమోదవుతోంది. మరో 53 జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్య ఉందని అధికారులు తెలిపారు. మే, జూన్ మధ్య జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. 83 శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్(బీఏ2) బయటపడిందని చెప్పారు.
రాజధాని నగరంలో :
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం 1,934 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం నమోదైన 928 కేసుల కంటే ఇది రెట్టింపు. దీంతో పాజిటివిటీ రేటు 8.10 శాతానికి చేరింది. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,755కు, మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,27,394కు పెరిగింది. మరోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 26,242గా ఉంది.
కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. బుధవారం కంటే గురువారం కరోనా కేసులు 8 శాతం మేర పెరిగి 13,313గా నమోదయ్యాయి. ఫిబ్రవరి 25 తర్వాత మళ్లీ 13 వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. కరోనా కేసుల నమోదు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్, బూస్టర్ డోసులను పెంచాలని సూచించారు.