బిహార్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల కారణంగా ఇప్పటివరకు 27 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ముజఫర్పూర్, భాగల్పూర్లో ఆరుగురు చొప్పున, లఖిసరాయ్ లో ముగ్గురు, వైశాలి, ముంగేర్ లలో ఇద్దరి చొప్పున మరణించారు. బంకా, జాముయి, కతిహార్, జెహానాబాద్, సరన్, నలంద, బెగుసరాయ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని అధికారులు వెల్లడించారు.
ఈదురుగాలుల తాకిడికి రోడ్డుపై కంటైనర్ బోల్తా పడంది. నదిలో పడవులు చిక్కుకున్నాయి. భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. అంతేకాదు.. పలు విమాన సర్వీసులనూ రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ట్రాఫిక్ స్తంభించింది. పాట్నా నుంచి భాగల్పూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఫలితంగా సమాచార వ్యవస్థ దెబ్బతింది. ఖాదియాలోని బీఎస్ఎన్ఎల్ టవర్ కూలిపోగా పలు జిల్లాల్లో మొబైల్ టవర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది మరమ్మతులను వేగవంతం చేసి సరఫరాను పునరుద్ధరిస్తున్నారు అధికారులు. సమస్తిపూర్, భాగల్పూర్, ఖగారియా, దర్భంగా, మధుబని, తూర్పు చంపారన్, సీతామర్హి, షెయోహర్, ముజఫర్పూర్, బెగుసరాయ్ సహా మరికొన్ని జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.