గుంటూరు: కోస్తాజిల్లాలకు ముసురు పట్టింది. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ఆగకుండా జల్లు పడుతూనే వుంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచలున్నాయని వాతావరణశాఖ చెబుతోంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలపై 1.5 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న కారణంగా రాగల 72 గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు 2.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయి. ఎవరూ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. చేపలు వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గాలులు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయి.