రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల ధరలు చుక్కలనుంటుతున్నాయి.
ఇటీవల వరుసగా ముసురు వానలు పడుతుండటంతో తోటల్లోని కూరగాయలను కోసేందుకు వీలులేకుండా పోయింది.
పొలాలన్నీ బురదమయం కావడంతో కాయ, ఆకు కూరలను తెంచడం కష్టంగా మారింది. దీంతో నగర మార్కెట్లకు వచ్చే దిగుమతులపై ప్రభావం పడింది. కేవలం శివారు జిల్లాలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వానలు పడుతుండడంతో అక్కడి నుంచి కూరగాయల రవాణా నిలిచిపోయింది.
ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారింది. నిన్నామొన్నటి వరకు హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు నగర ప్రజల అవసరాలను తీర్చినప్పటికీ, సోమవారం నుంచి ఇవి కూడా కరిగిపోవడంతో కూరగాయల రేట్లు మరింత పెరిగే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Advertisements
కూరగాయలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో టమాటా కేజీ రూ.30 నుంచి రూ.40 ఉండగా.. సోమవారం దీని ధర కిలోకు రూ. 50 వరకు పలికింది. పచ్చిమిర్చీ కూడా ఘాటెక్కింది. ఏకంగా వాటి ధర కిలో రూ. రూ.60, రూ.80 వరకు చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా కిలో రూ.20 నుంచి రూ.30 పెరిగాయి.