జమ్ము కశ్మీర్ లో గత నాలుగు రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో లోయలోని నాలుగు జిల్లాల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24 గంటల్లో బారాముల్లా,గందర్ బల్, కుప్వారా, బండిపోరి మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయిలో హిమపాతం సంభవించే అవకాశం ఉందని భారత వాతారవణ శాఖ హెచ్చరించింది.
అందువల్ల ఈ నాలుగు జిల్లాల్లో భారీ హిమపాతం సంభవించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని సూచించింది. కాగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్ మార్గ్ లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ మంచు చరియ విరగడంతో పోలండ్ కు చెందిన ఇద్దరు పర్యాటనకులు మృతిచెందారు.
మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు. అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. మరో వైపు భారీగా మంచు కురుస్తుండడంతో భూతల స్వర్గం మరింత అందాలను పులుముకుంది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారండంతో ఆస్వాదిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో హిమం గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో సాధారణ జనజీనవం స్తంభించిపోయింది. మంచు ధాటికి జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.