తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరుగుతోంది. ఏ శివాలయం చూసిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు చేసేందుకు ఆలయాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి.
శుక్రవారం రోజు నుంచే చాలా మంది భక్తులు ఆలయాలకు తరలి వెళ్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో మొదటి రోజు శుక్రవారం శివనామస్మరణతో పట్టణం మార్మోగింది.
స్వామివారి గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను రద్దు చేశారు. శని, ఆది వారాల్లో భక్తులందరికీ లఘు దర్శనమే కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శివార్చ వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుతో కలిసి శ్రీ పార్వతీపురం రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
మహాశివరాత్రి జాతర కోసం ఏపీ, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆలయ అధికారులు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా రాజన్న ఆలయ చెరువు ప్రాంతంలో దిగేందుకు ఏర్పాట్లు చేశారు.