సాధారణంగా ఏ బ్రీడ్ కి చెందిన కోడైనా రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మరీ అరుదుగా అయితే రెండు గుడ్లు పెడుతుంది. కానీ ఈ కోడి మాత్రం 24 గంటల్లో 31 గుడ్లు పెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో ఓ కోడిపెట్ట రోజులో 31 గుడ్లు పెట్టి రికార్డు సృష్టించింది. సాధారణంగా కోళ్లు పురుగులను తింటాయి. ఈ కోడి మాత్రం వాటి జోలికి వెళ్లదు. పల్లీలు, వెల్లుల్లి మాత్రమే తింటుంది.
అయితే కోడికి ఇప్పటి వరకు ఎలాంటి జబ్బు రాకపోవడం విశేషం. ఈ కోడిని గిరీష్ చంద్ర బుధాని అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. కొన్నాళ్ల క్రితం రూ.200లకు రెండు కోడి పిల్లలను కొన్న గిరీష్.. వాటిని కూడా ఇంటి సభ్యులుగా సాకడం మొదలు పెట్టాడు.
డిసెంబర్ 25న గిరీష్ పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి కోడి 5 గుడ్లు పెట్టిందని అతని పిల్లలు చెప్పారు. అది విన్న గిరీశ్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత కోడి ప్రతి 10, 15 నిమిషాలకు ఒక గుడ్డు పెట్టడం మొదలు పెట్టింది.
అలా మొత్తం 31 గుడ్లు పెట్టడం చూసి అందరూ అవాక్కయ్యారు. దీంతో కోడికి ఏదైనా వ్యాధి సోకిందేమోనని గిరీష్ భావించాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లగా కోడికి ఏమీలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే గిరీష్ కి చెందిన కోడి 31 గుడ్లు పెట్టిన విషయం చుట్టుపక్కల తెలియడంతో దాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు.