నిత్యా మీనన్ వర్సెటైల్ యాక్ట్రెస్. ప్రతి పాత్రలోనూ పరికాయప్రవేశం చేయగల నటిఆమె. మాతృభాష మళయాళం అయినా తెలగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది ఆమెకు. ఆ మధ్య వరుస సినిమాలతో బిజీ అయ్యారు. పాటలు కూడా అద్భుతంగా పాడగలరన్న విషయం తెలిసిందే.ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ లో జడ్జ్ గా చేసి మల్టీటాలెంటెడ్ అనే పేరు తెచ్చుకున్నారు.
తాజాగా ఇంగ్లీష్ టీచర్ గా అవతారం కూడా ఎత్తారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదు.. షూటింగ్ బ్రేక్ లో దగ్గర్లోని స్కూల్ కు వెళ్లిన నిత్య ఇలా టీచర్ గా మారిపోయారు .
విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగులో వివరిస్తూ పాఠం చెబుతున్న వీడియోను ఆమె తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
ఓ మలయాళ సినిమా షూటింగ్ కోసం నిత్యామీనన్ కృష్ణాపురం (ఏపీ, తెలంగాణలలో ఏ రాష్ట్రంలోని గ్రామం అనేదాంట్లో స్పష్టత లేదు) అనే గ్రామానికి వచ్చారు.
షూటింగ్ బ్రేక్ లో దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలకు ఇంగ్లిష్ పాఠం చెప్పారు. చక్కటి తెలుగులో మాట్లాడుతూ, ఇంగ్లీష్ పాఠాన్ని చదివి వినిపిస్తూ, తెలుగులో అర్థం చెబుతూ పాఠశాలలో సందడి చేశారు.
ఇదంతా రికార్డు చేసి నిత్యామీనన్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. కృష్ణాపురం గ్రామంలోని ఈ చిన్నారులతో కొత్త ఏడాదిలో మొదటిరోజు ఇలా గడిచిపోయిందని కామెంట్ జోడించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నిత్యాను మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారంటూ కితాబునిస్తున్నారు.