మునుగోడు బై ఎలక్షన్స్ కొత్త ఓటర్ల జాబితా పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ధర్మాసనం పరిశీలించింది. కొత్త ఓటర్ల జాబితా నివేదికను ఈసీకి సమర్పించాలని కోరుతూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. గురువారం కొత్త ఓటర్ల లిస్ట్ పిటిషన్ పై హైకోర్టులో విచారన జరిగింది.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. రెండు నెలల్లో కొత్తగా 25 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంపై విచారణ జరపాలని కోరుతూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయ్యిందని… నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఉపఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని బీజేపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
అంతకుముందు 7 నెలల్లో కేవలం 1,474 మంది మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ మధ్యకాలంలో 24,781 దరఖాస్తు చేసుకోవడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో జులై 31 నాటికి ఉన్న ఓటర్ లిస్ట్ ఆధారంగానే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేలా ఈసీకి ఆదేశించాలని కోరింది.
ఈ నెల 14న ఎలక్షన్ కమిషన్ కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించనున్నందున కోర్టు నిర్ణయం వెలువడే వరకు జాబితా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం గురువారం విచారణ జరుపుతామని చెప్పింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఉప ఎన్నికల సందర్భంగా నమోదు అయిన ఓటర్ల లిస్ట్ ను సమర్పించాలని ఈసీకి ఆదేశిస్తూ తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.