వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాఫ్ట్ వేర్ లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని ఆదేశించింది. కులం, కుటుంభ సభ్యుల వివరాలేవీ తీసుకోకూడదని స్పష్టం చేసింది.
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవచ్చన్న హైకోర్టు, అవసరం అనుకుంటే ఇతర గుర్తింపు పత్రాలు తీసుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించేది లేదని, ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే మా ఆందోళన అని కోర్టు స్పష్టం చేసింది. సాఫ్ట్ వేర్, మ్యానువల్ ల్లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.