కాంగ్రెస్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్పంచుల సమస్యలపై ధర్నా చేపట్టేందుకు హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. ధర్నాలో 300 మందికి మించి ఉండకూడదని హైకోర్టు షరతులు పెట్టింది. ధర్నాలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించింది.
రాష్ట్రంలో సర్పంచుల సమస్యలపై ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ పోలీసుల అనుమతి కోరింది. కానీ పర్మిషన్ ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణ అనంతరం ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
మళ్ళీ సభను ఎప్పుడు నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. అంతకు ముందు సర్పంచుల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సోమవారం కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ధర్నాకు అనుమతిలేదంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేశారు. దీంతో పొలీసుల తీరుపై రేవంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ఇంటికి వచ్చి మరి అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తాను తిరగకూడదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.