కాంగ్రెస్ వార్ రూం కేసులో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వార్ రూం కేసుకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వలేమని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 8న సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
డిసెంబర్ 27న సునీల్ కనుగోలుకు సైబర్ క్రైమ్ పోలీసులు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో పాటు నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై వార్ రూంలో సోదాలు నిర్వహించిన పోలీసులు దొరికిన ఆధారాల మేరకు కేసు నమోదు చేశారు.
అయితే ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు కోర్టుకు విన్నవించారు. ఎఫ్ఐఆర్ లో సునీల్ కనుగోలు పేరు తొలగించాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అయితే ఎఫ్ఐఆర్ లో ఏ1 నిందితుడిగా ఉన్న సునీల్ ను ప్రశ్నించేందుకు అనుమతించేలా ఆదేశించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వడం కుదరదని, జనవరి 8న సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని, విచారణకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది.