బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. బుధవారం ఆ తీర్పు కాపీ సీబీఐకి అందింది. దీంతో హైకోర్టు జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని జడ్జి అభిప్రాయపడ్డారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని చెప్పింది.
దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపింది హైకోర్టు. కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించిందనే ఆరోపణలు వచ్చాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలు ప్రజలకు వెళ్లిపోయాయని, దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదన్నారు. సిట్ విచారణ సరిగ్గా జరగనందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపింది. దర్యాప్తు ఆధారాలను బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు.
ఇక ఈ కేసుకు సంబంధించి బీజేపీ పిటిషన్ మెయింటైనబుల్ కాకపోవటంతో డిస్మిస్ అయింది. నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసింది. ఎఫ్ ఐ ఆర్ 455/2022 ను సీబీఐకి బదిలీ చేసి.. సిట్ చేసిన దర్యాప్తును రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు.