హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనం సందర్భంగా సర్కార్ తీసుకుంటున్న చర్యలేమిలో స్పష్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. జనం భారీగా గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. రసాయనాలతో కూడిన విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకుండా ఏం చేస్తారో చెప్పాలని కోరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదిక సెప్టెంబరు 1లోగా సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలను హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరుకావాలని సూచించింది.
హుస్సేన్సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఇళ్లల్లోనే మట్టిగణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సూచనలు కాదు.. స్పష్టమైన ఆదేశాలు ఉండాలన్న హైకోర్టు తేల్చి చెప్పింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా వేసింది