ప్రస్తుతం వ్యవసాయంలో ఎన్నో సాంకేతిక పరమైన మార్పులు జరుగుతున్నాయి. సంప్రదాయ పంటలు పండిస్తే పెద్దగా లాభాలు ఉండకపోవడంతో.. కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు. ఈ నేపథ్యంలో సంప్రదాయ పంటలు పండించే రైతులతో పోల్చితే.. అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నామంటున్నారు. ప్రస్తుతం రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పంటల్లో వెనీలా కూడా ఉంది.
మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు వెనీలాను పండిస్తున్నారు. కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదైన పంటగా వెనీలాయే ఉండటం గమనార్హం. మడగాస్కర్, పపువా న్యూగినియా, భారత్, యుగాండా వంటి దేశాల్లో ఎక్కువగా వీటి సాగు జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐస్క్రీమ్లో వెనీలా ఫ్లేవర్ వాడకం 40 శాతం వరకు ఉంటోందని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. వెనిలా పండు సువాసన అద్భుతంగా ఉంటోందని అంటున్నారు. దీనిని కేకులు, ఐస్క్రీమ్లు, పర్ఫ్యూమ్స్, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారని అంటున్నారు.
వెనీలాలో వెనిలిన్ అనే రసాయన మూలకం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తొలగించడంలో దోహదపడుతోందని.. వీటి పండ్లు, విత్తనాలు క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తాయని అంటున్నారు. పొట్టను శుభ్రం చేయడం, వ్యాధి నిరోధక శక్తి పెంచడం, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తోందని అంటున్నారు.
దీంతో మార్కెట్లో వెనీలా పండ్లు, విత్తనాలకు మంచి డిమాండ్ పెరిగిపోయిందంటున్నారు. తద్వారా అధిక ధర లభించడంతో రైతులకు భారీగా ఆదాయం వస్తోంది. వెనిలా సాగుకు గోధుమ రంగు నేలలు ఎంతో అనువుగా ఉంటాయి. నేల పీహెచ్ విలువ 6.5 నుండి 7.5 వరకు ఉంటే.. ఆ భూమిలో వెనిలా మొక్కలు బాగా పెరిగి.. పండ్లు పొడవుగా ఎదుగుతాయి.
వెనిలా పుష్పించి.. కాయలు కాసి.. కోతకు రావడానికి దాదాపు 10 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత వాటి నుంచి విత్తనాలను వేరు చేసి.. వాటిని అనేక ఆహార పదార్థాల తయారీలో వినియోగిస్తారు. ప్రస్తుతం మనదేశంలో కిలో వెనీలా విత్తనాల ధర రూ.40 నుంచి రూ. 50వేల వరకు పలుకుతున్నాయి. వెనీలాను పెద్ద ఎత్తున సాగు చేస్తే.. రైతులు కోటీశ్వరులవుతారని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇటీవల దేశంలో ఎక్కువగా రైతులు వెనీలా పంట పండించేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.