టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎస్, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఈ కీలక భేటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం. టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్న పత్రాలు లీకైన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ వ్యవహారం పై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పరీక్షలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో తదుపరి నిర్వహించే పరీక్షల విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంతో పాటు అభ్యర్థులకు భరోసా ఇచ్చేలా, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.