కేసీఆర్ సర్కార్ను హైకోర్టు మరోసారి కడిగిపారేసింది. ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఎలా ఖర్చుపెడతారని నిలదీసింది. ట్రెజరీ నిబంధనలను ఉల్లంఘించడంపై చివాట్లు పెట్టింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చుల కోసం ప్రభుత్వ నిధులను వినియోగించుకోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆనిధులను విడుదల చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో సీసీఎల్ఏ కమిషనర్గా, ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్పై వందలాది కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి విచారణ ఖర్చుల కోసం కేసీఆర్ ప్రభుత్వం సోమేష్కుమార్ పట్ల అత్యంత ఉదారతను ప్రదర్శించింది. కోర్టుల్లో కేసుల విచారణ ఖర్చుల కోసం రూ. 58కోట్ల మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. లెక్చరర్ ప్రభాకర్ హైకోర్టులో పిల్ వేయగా.. తాజాగా సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది.
ప్రభుత్వం నిర్ణయంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక ప్రభుత్వ అధికారిపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్లు మంజూరు చేయడమేంటని విస్తుపోయింది. అలా ఎలా ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని ఆదేశించింది. అసలు ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని నిలదీసింది. రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్కు కూడా వ్యక్తిగత హోదాలో నోటీసు పంపింది. తదుపరి విచారణను హైకోర్టు అక్టోబరు 27కి వాయిదా వేసింది. అప్పటి వరకు నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.