తెలంగాణ ప్రభుత్వం కీలన నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు ఈనెల 30వరకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మహమ్మారి కట్టడి చేయాలంటే.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులను కొంత కాలం పాటు నిలిపివేయాలని వైద్యఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో అన్ని విద్యాసంస్థలకు నెలాఖరు వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది.
విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో కరోనాపై చర్చించే అవకాశం ఉంది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులను కొంత కాలం పాటు నిలిపివేయాలని వైద్యఆరోగ్య శాఖ.. ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు చర్చకు రావోచ్చని అంటున్నారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలా? సెలవులు మరి కొన్ని రోజులు పొడిగించాలా అని సమాలోచనలు చేయనున్నారు.
తెలంగాణలో కరోనా కేసుల క్రమం తప్పకుండా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,963 మందికి కరోనా సోకింది. 53,073 కరోనా పరీక్షలు చేయగా.. ఈ కేసులు బయటపడ్డాయి. ముందురోజు కంటే తాజాగా నమోదైన కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇప్పటి వరకు తెలంగాణలో 7,05,199మందికి కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా కరోనాతో రెండు మరణాలు సంభవించాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,054కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అటు రోజువారీ రికవరీ రేటు కూడా గణనీయంగా నమోదవుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో 1,620 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 6,81,091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.31 శాతానికి తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 22,017 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి.